ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ..ఆయన రాసిన పుస్తకాలు నేటి యువతకు మార్గదర్శకం: మంత్రి వివేక్

ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ..ఆయన రాసిన పుస్తకాలు నేటి యువతకు మార్గదర్శకం: మంత్రి వివేక్
  •  పీవీ జయంతి సందర్భంగా రక్తదానం చేసిన డోనర్స్​కు మంత్రి సన్మానం

బషీర్​బాగ్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు దేశంలో ఆర్థిక సంస్కరణలకు పితామహుడని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రస్తుతం భారత్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడానికి పునాది పీవీ కాలంలోనే పడిందని తెలిపారు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని భారతీయ విద్యా భవన్​లో పీవీ నరసింహా రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీవీ జయంతిని పురస్కరించుకొని రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. పీవీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రక్తదానం చేసిన డోనర్స్​ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో తన తండ్రి దివంగత వెంకటస్వామి ఆయనతో కలిసి కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ట్రేడ్ యూనియన్ లీడర్ గా తన తండ్రి అనుభవాలను పీవీ గుర్తించి, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు.

గొప్ప ఆర్థిక సంస్కర్త దేశానికి ప్రధాని కావడం దేశ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, నిరుపేదలకు విద్యను అందించిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు. పీవీ రచించిన పుస్తకాలు నేటి యువతకు మార్గదర్శకంగా ఉంటా యని.. ప్రతిఒక్కరూ ఆయన పుస్తకాలను చదవా లని సూచించారు. ఆయన పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి, సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సభ్యులను వివేక్ వెంకటస్వామి అభినందించారు.

అనంతరం ట్రాన్స్​కో, జెన్​కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. బహు భాషా కోవిదుడు పీవీ అని కొనియాడారు. పేదల కు భూములు పంపిణీ చేసిన గొప్ప నాయకుడని అన్నారు. భూ సంస్కరణలు ఆయన ఇంటి నుంచే మొదలు పెట్టారని పేర్కొన్నారు. కార్యక్ర మంలో పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు, మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పీవీఆర్ కశ్యప్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు జితేందర్ రావు తనుగుల తదితరులు పాల్గొన్నారు.